సనాతన ధర్మంలో శుక్రవారానికి ఒక ప్రత్యేకమైన, పవిత్రమైన స్థానం ఉంది. ఈ రోజు సిరిసంపదల అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మికి, భౌతిక సుఖాలను ప్రసాదించే శుక్ర గ్రహానికి అత్యంత ప్రీతిపాత్రమైనది. అందుకే ప్రతి శుక్రవారం ఇళ్లలో పూజలు, నోములు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తుంటారు. అయితే, ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవి కటాక్షం, అష్టైశ్వర్యాలు సిద్దించాలంటే శుక్రవారం నాడు కొన్ని పనులకు దూరంగా ఉండాలి. ఆ నియమాలేంటో, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
శుక్రవారం నాడు చేయకూడని 4 పనులు..
మాంసాహారానికి దూరం: శుక్రవారం నాడు పూర్తిగా సాత్విక ఆహారం మాత్రమే భుజించాలి. ఈ పవిత్రమైన రోజున మాంసాహారం, మద్యపానం వంటి తామసిక ఆహారపు అలవాట్లకు దూరంగా ఉండటం ఎంతో ముఖ్యం. పరిశుభ్రమైన ఆహారం తీసుకునే ఇంట్లోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
పుల్లని పదార్థాలు వద్దు.. శుక్రవారం రోజున ఆహారంలో అధికంగా పుల్లని పదార్థాలను చేర్చకూడదని పెద్దలు చెబుతారు. లక్ష్మీదేవి ఆరాధన జరిగే ఈ శుభ దినాన పులుపును ఎక్కువగా తీసుకోవడం ఆధ్యాత్మికంగా అనుచితమని ఒక నమ్మకం.
అప్పులు ఇవ్వకండి..
ఆర్థిక లావాదేవీల విషయంలో శుక్రవారం నాడు కొంత జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఈ రోజున ఇతరులకు అప్పుగా డబ్బు ఇవ్వడం లేదా పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు చేయడం అశుభంగా పరిగణిస్తారు. ఈ రోజు ఇచ్చిన డబ్బు త్వరగా తిరిగి రాదనేది ఒక ప్రబలమైన విశ్వాసం.
వెండి, పంచదార దానం చేయొద్దు..
దానం చేయడం అనేది మహోన్నతమైన పుణ్యకార్యమే అయినప్పటికీ, శుక్రవారం నాడు వెండి వస్తువులను, పంచదారను దానం చేయడం నిషిద్ధం. ఇలా చేయడం వల్ల శుక్ర గ్రహం వల్ల కలిగే శుభ ఫలితాలు తగ్గిపోతాయని, ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని జ్యోతిష్య, ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.
లక్ష్మీ కటాక్షం కోసం శుక్రవారం ఏం చేయాలి..?
అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు కుటుంబంలో వెల్లివిరియాలంటే శుక్రవారం నాడు ఈ నియమాలను పాటించడం ఎంతో శ్రేయస్కరం..
భక్తి శ్రద్ధలతో ఆరాధన..ఉదయాన్నే స్నానాదికాలు ముగించుకుని, అత్యంత నిష్ఠతో శ్రీ మహాలక్ష్మికి కుంకుమార్చన లేదా పూజ చేయాలి.
మంత్ర పఠనం.. పూజా సమయంలో 'శ్రీ సూక్తం' చదవడం లేదా లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళిని పఠించడం వల్ల అమ్మవారి కృపకు పాత్రులు కావచ్చు.
పరిశుభ్రతే మహాలక్ష్మి.. ఇల్లు, పరిసరాలు ఎక్కడైతే పరిశుభ్రంగా ఉంటాయో అక్కడే లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. కాబట్టి ఇంటిని, ముఖ్యంగా పూజ గదిని అత్యంత శుభ్రంగా ఉంచుకోవాలి.
నిరుపేదలకు సాయం..మీ స్తోమతకు తగ్గట్టుగా ఆకలితో ఉన్నవారికి లేదా ఆపదలో ఉన్న పేదలకు సహాయం చేయడం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన విషయం.
సత్ప్రవర్తన, సానుకూల దృక్పథం.. మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు లేకుండా, అందరి పట్ల దయతో, సానుకూల దృక్పథంతో వ్యవహరించాలి. సత్ప్రవర్తన కలిగిన వారిని చూసి దేవతలు సైతం సంతోషిస్తారు.
ఈ నియమాలు, పద్ధతులు సనాతన ధర్మంలో శతాబ్దాలుగా వస్తున్న మత విశ్వాసాలు, సంప్రదాయాలపై ఆధారపడి ఉన్నాయి. వీటిని ఆచరించడం ద్వారా మానసిక ప్రశాంతత, సానుకూల శక్తి దరిచేరుతాయని నమ్ముతారు.
