కురుక్షేత్ర మహాసంగ్రామంలో బంధుమిత్రులను చూసి మోహంతో, విషాదంతో కుంగిపోయిన అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ చేసిన గీతోపదేశం కేవలం ఆనాటికే పరిమితం కాలేదు. నాటి అర్జునుడి పరిస్థితే దాదాపు నేటి ఆధునిక మానవుడిది కూడా. ఒత్తిడి, ఆందోళనలతో సతమతమవుతున్న నేటి సమాజానికి భగవద్గీత ఒక గొప్ప దిక్సూచి. గీతాచార్యుడు చెప్పిన ఈ ఐదు సూత్రాలను ఆచరిస్తే జీవితం సుఖసంతోషాలతో, ప్రశాంతంగా సాగుతుంది.
1. కర్మ చేయడం వరకే మన హక్కు..
శ్రీకృష్ణుడు చెప్పిన ప్రసిద్ధ శ్లోకం "కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన". అంటే, కర్మలు..పనులు చేయడం వరకే నీకు అధికారం ఉంది, ఫలితం మీద కాదు అని అర్థం. భవిష్యత్తులో వచ్చే ఫలితం గురించి అనవసరంగా చింతిస్తూ కూర్చోకుండా, వర్తమానంలో మన కర్తవ్యాన్ని మనం శ్రద్ధగా నిర్వర్తిస్తే విజయం దానంతట అదే వస్తుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి దరిచేరదు.
2. మార్పు అనేది సృష్టి ధర్మం..
ఈ సృష్టిలో ఏదీ స్థిరం కాదు, మార్పు అనేది అనివార్యం. ఈరోజు నీది అనుకుంటున్నది, రేపు మరొకరిది అవుతుంది. ఎప్పుడైతే ఈ ప్రకృతి ధర్మాన్ని మనం అంగీకరిస్తామో, అప్పుడు సుఖదుఃఖాలను, లాభనష్టాలను సమానంగా స్వీకరించే మనస్తత్వం అలవడుతుంది. స్థితప్రజ్ఞతతో జీవించడం సాధ్యమవుతుంది.
3. క్రోధం... వినాశనానికి మూలం..
భగవద్గీత ప్రకారం కోపం మనిషిలో తీవ్రమైన గందరగోళాన్ని సృష్టిస్తుంది. ఆ గందరగోళం వల్ల జ్ఞాపకశక్తి, విచక్షణా జ్ఞానం నశిస్తాయి. ఎప్పుడైతే మంచి, చెడులను విమర్శించే విచక్షణ కోల్పోతాడో, మనిషి పతనానికి అదే నాంది అవుతుంది. కాబట్టి, కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వివేకవంతుల లక్షణం.
4. దేహం నశ్వరం.. ఆత్మ శాశ్వతం..
మనిషి పాతబడిన దుస్తులను విడిచిపెట్టి, కొత్త దుస్తులను ఎలా ధరిస్తాడో... ఆత్మ కూడా జీర్ణమైపోయిన శరీరాన్ని వదిలి కొత్త దేహాన్ని దాల్చుతుంది. శరీరానికి మాత్రమే మరణం ఉంది కానీ, ఆత్మకు లేదు. ఆత్మ అజరామరం అని పరమాత్మ బోధించాడు. ఈ తత్వాన్ని అర్థం చేసుకుంటే మనిషిలో మరణ భయం తొలగిపోయి, జీవితాన్ని నిర్భయంగా ఆస్వాదించగలుగుతాడు.
5. మనో నిగ్రహమే మహా బలం..
మనస్సు అత్యంత చంచలమైనది. అది గాలిలా ఎటు పడితే అటు పరుగెడుతుంది. దాన్ని అదుపు చేయడం కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాదు. నిరంతర సాధన, వైరాగ్యం ద్వారా మాత్రమే మనస్సును నియంత్రించగలం. మనస్సు మన ఆధీనంలో ఉంటే సాధించలేనిది ఏదీ లేదు.
భగవద్గీత మనకు బోధించే అత్యుత్తమ పాఠం ఏమిటంటే.. జీవితం అనేది కేవలం పరిస్థితుల కలయిక కాదు, ఆ పరిస్థితులకు మనం ఎలా స్పందిస్తున్నాం అనేదే ముఖ్యం. ఈ ఐదు సూత్రాలను ప్రతిరోజూ ఆచరణలో పెడితే, లౌకిక విజయాలతో పాటు ఆంతరంగిక ప్రశాంతత కూడా మన సొంతమవుతుంది.
