భారతీయ సనాతన ధర్మంలో మహాభారతానికి ఉన్న స్థానం అద్వితీయం. దీన్ని ‘పంచమ వేదం’ అని కూడా పిలుస్తారు. ఇది కేవలం దాయాదుల పోరును తెలిపే యుద్ధ కథ కాదు,మానవాళికి ధర్మం, కర్మ, మోక్ష మార్గాలను ఉపదేశించే అద్భుతమైన జీవన వేదం. ఈ బృహత్తర ఇతిహాసాన్ని దర్శించిన వారు సాక్షాత్తూ శ్రీహరి స్వరూపమైన మహర్షి వేదవ్యాసుడు. అయితే, ఆయన మదిలో రూపుదిద్దుకున్న ఈ మహా కావ్యాన్ని అక్షరబద్ధం చేయడానికి జరిగిన నేపథ్యం ఎంతో ఆసక్తికరం.
లేఖకుడి కోసం వ్యాసుని అన్వేషణ..
వ్యాస మహర్షి మహాభారతాన్ని రచించాలని సంకల్పించినప్పుడు ఆయన ముందున్న అతిపెద్ద సవాలు.. తాను చెబుతుంటే అంతే వేగంగా, తప్పులు లేకుండా రాయగలిగే సమర్థుడైన రాసేవాడు దొరకడం. ఒకవేళ సాధారణ లేఖకులను ఎంచుకుంటే, ఈ మహత్కార్యంలో అపచారాలు జరగవచ్చు. ఇది ఏ సామాన్య మానవుడితోనూ సాధ్యపడేది కాదని భావించిన వ్యాసుడు, సాక్షాత్తూ ఆ విఘ్నవినాశకుడైన, బుద్ధికి ఆధిపతి అయిన గణనాథుడిని ప్రార్థించాడు. వ్యాసుని అభ్యర్థన మన్నించి, మహాభారతాన్ని లిఖించేందుకు వినాయకుడు అంగీకరించాడు. కానీ, అక్కడే ఒక ఆసక్తికరమైన షరతు విధించాడు.
గణాధిపతి పెట్టిన కఠినమైన షరతు..
జ్ఞానస్వరూపుడైన వినాయకుడు వ్యాసునితో.. "మహర్షీ! నేను ఈ మహాకావ్యాన్ని రాయడానికి సిద్ధమే. కానీ నాకో షరతు ఉంది. నేను రాయడం ప్రారంభించిన క్షణం నుంచి నా కలం ఒక్క క్షణం కూడా ఆగకూడదు. మీరు కథను ఆపకుండా చెబుతూనే ఉండాలి. ఒకవేళ మీరు చెప్పడం ఆపితే, నా కలం ఆగిపోతుంది.. నేను రాయడం మానేస్తాను" అని చెప్పాడు.
వ్యాస భగవానుడి అద్భుతమైన ప్రతివ్యూహం..
వినాయకుడు పెట్టిన షరతు విన్న వ్యాసుడు క్షణకాలం ఆలోచించాడు. లక్షల శ్లోకాలతో కూడిన ఈ బృహత్ గ్రంథాన్ని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటవెంటనే చెప్పడం ఎంతటివారికైనా అసాధ్యం. అప్పుడు వ్యాసుడు తన అపారమైన బుద్ధికుశలతతో వినాయకుడికి మరో షరతు విధించాడు.
"ఓ గణాధిపతీ! నీ షరతుకు నేను అంగీకరిస్తున్నాను. కానీ నాదీ ఒక షరతు. నేను చెప్పే ప్రతి శ్లోకం యొక్క అర్థాన్ని, అంతరార్థాన్ని నువ్వు పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాతే అక్షరబద్ధం చేయాలి. అర్థం చేసుకోకుండా ఏ ఒక్క అక్షరం కూడా రాయకూడదు" అన్నాడు.
గణనాథుడు ఆ షరతుకు చిరునవ్వుతో సమ్మతించాడు.
ఆగిన కలం.. సాగిన కావ్యం..!
ఇలా ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందంతో మహాభారత రచన చారిత్రక ఘట్టం ప్రారంభమైంది. వేదవ్యాసుడు శ్లోకాలను ధారాళంగా చెబుతుంటే, వినాయకుడు అంతే వేగంగా రాసుకుంటూ వెళ్లాడు. అయితే వ్యాసుడికి తర్వాతి శ్లోకాలను మనసులో సిద్ధం చేసుకోవడానికి కొంత సమయం కావాల్సి వచ్చినప్పుడల్లా.. కావాలని కొన్ని అత్యంత క్లిష్టమైన, గంభీరమైన వేదాంత శ్లోకాలను వీటిని 'గ్రంథి శ్లోకాలు' లేదా 'వ్యాస ఘట్టాలు' అంటారు. చెప్పేవారు.
వాటిని వినగానే గణాధిపతి కలం క్షణకాలం ఆగేది. ఆ శ్లోకాల అర్థాన్ని, అందులోని వేదాంత రహస్యాన్ని ఆకళింపు చేసుకుని ఆయన రాసేలోపు.. వ్యాసుడు తర్వాతి శ్లోకాలను సిద్ధం చేసుకునేవారు.
ఈ అద్భుతమైన ఘట్టం కేవలం ఒక కథ కాదు, ఇది మనకు ఒక గొప్ప జీవన సత్యాన్ని బోధిస్తుంది. ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా లేదా పెద్ద సవాలునైనా సమయస్ఫూర్తితో, బుద్ధిబలంతో సులభంగా అధిగమించవచ్చు అని వ్యాస, వినాయకుల ఈ ఒప్పందం నిరూపిస్తుంది. ఒక మహత్కార్యాన్ని సాధించడానికి జ్ఞానం (వ్యాసుడు), ఆచరణ (వినాయకుడు) రెండూ సరైన సమన్వయంతో సాగాలని ఈ వృత్తాంతం తెలియజేస్తుంది.
