సనాతన హిందూ ధర్మంలోని 18 మహాపురాణాలలో గరుడ పురాణానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సాధారణంగా గరుడ పురాణం అనగానే కేవలం మరణం, మరణానంతర జీవితం, ఆత్మ ప్రయాణం గురించే వివరిస్తుందని చాలామంది భావిస్తారు. కానీ, ఇందులో మానవుడు నిత్య జీవితంలో ఎలా నడుచుకోవాలి, ఎలాంటి పనులు చేయాలి, ఏవి చేయకూడదు అనే విషయాలను కూడా స్పష్టంగా పేర్కొన్నారు.
గరుడ పురాణం ప్రకారం, కొన్ని పనులను రాత్రి సమయాల్లో అస్సలు చేయకూడదు. పొరపాటున ఆ పనులు చేస్తే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరిగిపోవడమే కాకుండా, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, దారిద్య్రం, అశాంతి నెలకొంటాయని పురాణ వచనం. ఇంతకీ రాత్రిపూట చేయకూడని ఆ 4 పనులను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1. రాత్రిపూట అంత్యక్రియలు అంటే దహన సంస్కారాలు..
హిందూ సంప్రదాయంలో మరణానంతరం నిర్వహించే సంస్కారాలకు కొన్ని నియమాలు ఉన్నాయి. గరుడ పురాణం ప్రకారం, సూర్యాస్తమయం తర్వాత అంటే రాత్రి వేళల్లో అంత్యక్రియలు లేదా దహన సంస్కారాలు నిర్వహించకూడదు. రాత్రిపూట దహనం చేయడం వల్ల సదరు ఆత్మకు మోక్షం లభించదని, పరలోక ప్రయాణంలో ఆ ఆత్మ అనేక కష్టాలను, నరకయాతనను అనుభవిస్తుందని నమ్ముతారు. అందుకే రాత్రివేళల్లో దహన సంస్కారాలను నిషేధించారు.
2. మృతదేహాన్ని ఒంటరిగా వదిలివేయడం..
ఒకవేళ ఎవరైనా రాత్రి సమయంలో మరణిస్తే, శాస్త్ర నియమాల ప్రకారం ఉదయం వరకు దహన సంస్కారాల కోసం వేచి చూస్తారు. అయితే, ఈ సమయంలో మృతదేహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా వదిలిపెట్టకూడదు. రాత్రి వేళల్లో ప్రతికూల శక్తులు లేదా దుష్ట శక్తులు ఎక్కువగా సంచరిస్తుంటాయని, ఒంటరిగా ఉంచితే అవి మృతదేహంలోకి ప్రవేశించే ప్రమాదం ఉందని గరుడ పురాణం చెబుతోంది. అందుకే రాత్రి వేళల్లో శవం వద్ద ఎవరో ఒకరు ఉంటూ.. దీపం లేదా అగరబత్తులు వెలిగించి, దైవనామ స్మరణ చేయాలి.
3. రాత్రిపూట ఇల్లు ఊడవడం, శుభ్రం చేయడం..
చాలామంది రాత్రి భోజనాలు అయిపోయిన తర్వాత ఇల్లు ఊడవడం, శుభ్రం చేయడం లాంటివి చేస్తుంటారు. కానీ శాస్త్రాల ప్రకారం చీకటి పడిన తర్వాత ఇల్లు ఊడవకూడదు. రాత్రివేళల్లో ఇల్లు తుడవడం లేదా ఊడవడం వల్ల సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందని భగవద్గీత, పురాణాలు చెబుతున్నాయి. దీనివల్ల ఇంట్లోని లక్ష్మీకటాక్షం తగ్గిపోయి, తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, దారిద్య్రం ఏర్పడే అవకాశం ఉంది.
4. తులసి మొక్కకు నీరు పోయడం..
తులసి మొక్కను సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తాం. ఉదయం పూట తులసి కోటకు పూజ చేసి నీరు పోయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. కానీ, సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్కను తాకడం కానీ, దానికి నీరు పోయడం కానీ అస్సలు చేయకూడదు. రాత్రిపూట తులసి మాత విశ్రాంతి తీసుకుంటుందని నమ్మకం. ఆ సమయంలో నీరు పోసి ఆరాధించడం వల్ల పుణ్యానికి బదులు దోషం చుట్టుకుంటుంది. ఇది ఇంట్లోకి పేదరికం రావడానికి కారణమవుతుంది.
చివరగా చెప్పాలంటే.. ప్రకృతి నియమాలకు అనుగుణంగా మన జీవన విధానాన్ని మార్చుకోవడమే సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం. గరుడ పురాణంలో చెప్పబడిన ఈ చిన్న చిన్న నియమాలను పాటించడం ద్వారా కుటుంబంలో అశాంతిని దూరం చేసుకొని, సుఖసంతోషాలతో వర్ధిల్లవచ్చు.
